పంత్ నువ్వు అలా ఆడితే విజయం కష్టమే: సెహ్వాగ్

  • గెలుపా, ఓటమా అన్నది ముఖ్యం కాదు
  • పంత్ కనీసం 60 పరుగులు అయినా చేసి ఉండాలి
  • కెప్టెన్ కనుక బాధ్యతగా ఆడాలన్న ఆలోచన ఫలితం ఇవ్వదు
  • బ్యాట్ ను ఝళిపించాల్సిందేనన్న సెహ్వాగ్
కొత్త జట్టు లక్నో చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి పాలైంది. చేతిలో అన్నేసి వికెట్లు ఉన్నా, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు తడబడుతూ ఆడడం పట్ల అభిమానులు, విశ్లేషకుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం దీనిపై స్పందించాడు. పంత్ ఆటతీరును అతడు తప్పుబట్టాడు. ఇలా అయితే కష్టమన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు.

‘‘పంత్ ఆడిన ఆటతీరుపైనే ఆందోళన అంతా. గెలుపా, ఓటమా అన్నది ఇక్కడ కీలకం కాదు. అతడు ఆడిన బాల్స్ కు కనీసం 60 పరుగులు అయినా చేయాలి. అతడు మరో 20 పరుగులు చేసి ఉంటే లక్నో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చేది. పంత్ ఎంతో స్వేచ్ఛగా ఆడాలి. పెద్ద స్కోరు చేసిన రోజు అతడు జట్టుకు విజయాన్ని ఇవ్వగలడు. అది అందరికీ తెలుసు.

కానీ, తాను కెప్టెన్ కనుక బాధ్యతగా ఆడాలన్న ఆలోచనతో ఉన్నాడు. ఇలానే ఆలోచిస్తే ఐపీఎల్ 2022 సీజన్ లో విజయం సాధించలేడు. బాధ్యతాయుతంగా ఆడి ఆటను ముగించాలన్న వైఖరి పనికిరాదు. బాల్ ను చితకబాదాల్సిందే. అదే అతడి నిజమైన ఆటతీరు’’ అని సెహ్వాగ్ పేర్కొన్నాడు. 

గురువారం నాటి మ్యాచ్ లో పంత్ 36 బంతులు ఆడి 39 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ మూడు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగా.. లక్నో సూపర్ జెయింట్స్ కేవలం మరో రెండు బంతులు మిగిలి ఉన్నాయనగా విజయాన్ని దక్కించుకుంది.

wont successful
sehwag
rishab pant
ipl

More Telugu News